KTR: అదే నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవరి వైపు ఉందో తెలుస్తుందన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి, ఎన్నికల నాటి విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సిరిసిల్లలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్‌పై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపును చూసి కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మాటమార్చి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారని విమర్శించారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో కడియం, పోచారం ఉన్నారని ఎద్దేవా చేశారు. స్వార్థపూరిత పదవుల కోసం వారు పాకులాడుతున్నారని ఆరోపించారు.

గెలుపు కోసం కాంగ్రెస్‌ ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. సర్పంచ్‌ అయినా, ఎమ్మెల్యే, ఎంపీలు అయినా ప్రజల కోసమే పనిచేయాలని సూచించారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ నిధులు ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి వస్తాయని, వాటిని ఆపే అధికారం ముఖ్యమంత్రితో సహా ఎవరికీ లేదని తేల్చి చెప్పారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే పోరాడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనవరిలో ఎన్నికలు వస్తే ఆ దిశగా ముందుకు సాగుదామని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త గ్రామ, మండల, జిల్లా కమిటీలను వేసుకుందామని తెలిపారు. యువతకు, సీనియర్లకు సమానంగా అవకాశాలు కల్పిద్దామని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana Politics
BRS Party
Congress Party
MLAs Resignation

More Telugu News