Telangana: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణలో 40 మంది లొంగుబాటు

40 Naxalites Surrender Before DGP in Telangana
షార్ట్స్‌లో చూడండి
మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ‌ మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లొంగిపోయిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, వారి లొంగుబాటుకు గల కారణాలను వివరించనున్నారు.

"ఆపరేషన్ కగార్"తో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్లలో హిడ్మా, చలపతి, బస్వరాజ్, గణేశ్‌ వంటి అనేక మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

అగ్ర నాయకత్వం అంతమవ్వడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇంత పెద్ద సంఖ్యలో క్యాడర్ లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.
Go Back to Shorts
Telangana
Maoists
Maoist Party
Shivadhar Reddy
Telangana DGP
Naxalites surrender
Operation Kagar
Amit Shah Maoists
Chhattisgarh Maoists
Maoist movement
Naxal surrender Telangana

More Telugu News