హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్.. రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

  • తెలుగు సినిమాలను మిస్ అవుతున్నానన్న రకుల్
  • మంచి కథ దొరికితే తప్పకుండా టాలీవుడ్‌లో నటిస్తానని వెల్లడి
  • బాహుబలి లాంటి సినిమా చేయడం తన డ్రీమ్ రోల్ అని వ్యాఖ్య
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, తాను మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రంలో నటించడం తన కల అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ కడాలి చక్రవర్తి (చక్రి) కొత్తగా ఏర్పాటు చేసిన "సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ"ని రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"నాకు తొలి విజయాన్ని అందించింది తెలుగు సినిమానే. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడంతో అందరినీ చాలా మిస్ అవుతున్నాను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తాను. నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి" అని రకుల్ కోరారు. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలనే కోరిక బలంగా ఉందని, ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని ఆమె వెల్లడించారు.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్, అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్‌డమ్ సంపాదించారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించిన ఆమె, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News