చెన్నై రెస్టారెంట్ బిల్‌ చూసి ఎన్ఆర్ఐ బాలుడి షాక్.. వీడియో ఇదిగో!

  • ఏడు పదార్థాలు ఆర్డర్ చేసినా బిల్లు 15 వందలేనా? అంటూ ఆశ్చర్యం
  • న్యూజిలాండ్ లో అయితే మూడు పదార్థాలకే 200 డాలర్లు బిల్లు వేస్తారని వెల్లడి
  • మా సాలరీ స్లిప్పులు చూస్తే ఆ బిల్లు ఎక్కువే అంటావంటూ నెటిజన్ల కామెంట్లు
చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేశాక, బేరర్ తెచ్చిన బిల్లును చూసి ఎన్ఆర్ఐ బాలుడు ఆశ్చర్యపోయాడు. ఏడు రకాల ఆహార పదార్థాలు ఆర్డర్ చేసినా బిల్లు కేవలం రూ.1500 మాత్రమే కావడం చూసి ఇండియాలో రెస్టారెంట్లు చాలా తక్కువ మొత్తం చార్జ్ చేస్తాయని అంటున్నాడు. అదే న్యూజిలాండ్ లో అయితే కేవలం మూడు పదార్థాలు ఆర్డర్ చేసినా సరే 200 డాలర్ల బిల్లు వస్తుందని, ఇక్కడ ఏడు పదార్థాలు ఆర్డర్ చేసినా బిల్లు 30 డాలర్లకు మించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బిల్లును చూసి కొడుకు ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ ను రికార్డు చేసిన ఆ బాలుడి తల్లి.. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

న్యూజిలాండ్ లో పుట్టిపెరిగిన ఆ బాలుడికి చెన్నై రెస్టారెంట్ బిల్లు చౌక అనిపించడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఏడు ఐటమ్ లకు రూ.1500 బిల్లు అంటే భారతీయులకు మాత్రం ఖరీదైన వ్యవహారమేనని చెబుతున్నారు. ఇక్కడి రెస్టారెంట్ల బిల్లులు చూసి ఆశ్చర్యపోయిన ఆ బాలుడికి ఇక్కడి ఉద్యోగుల శాలరీ స్లిప్పులు చూపిస్తే అప్పుడు ‘బాబోయ్ ఇంత ఖరీదా?’ అని ఆశ్చర్యపోతాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ ఫన్నీగా స్పందిస్తూ.. ‘బహుశా ఆ బాలుడు మళ్లీ న్యూజిలాండ్ వెళ్లడేమో’ అంటూ కామెంట్ చేశాడు.


More Telugu News