టూరిజం హబ్ గా పోలవరం పరిసరాలు: ఏపీ మంత్రి నిమ్మల
- పోలవరం ప్రాజెక్టు వద్ద 9900 ఎకరాల్లో టూరిజం హబ్
- లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నామన్న మంత్రి నిమ్మల
- తెలుగుదనం ఉట్టిపడేలా స్పిల్ వే బ్యూటిఫికేషన్
- జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కొత్త ప్రతిపాదనలు
అమరావతి సచివాలయంలో పోలవరం స్పిల్ వే బ్యూటిఫికేషన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్కిటెక్ట్స్, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం స్పిల్ వే నిర్మాణం తెలుగుదనం, రాష్ట్ర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలవరం లెఫ్ట్ బ్యాంకును కలుపుతూ వంతెనల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారులను 365 బీబీ నుంచి 516ఈ వరకు అనుసంధానిస్తూ పటిష్ఠమైన రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్స్ పాల్గొన్నారు.