ఓటీటీలోకి వస్తున్న ఐశ్వర్యా రాజేశ్ థ్రిల్లర్ మూవీ

  • అర్జున్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన ‘మఫ్టీ పోలీస్’
  • థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని క్రైమ్ థ్రిల్లర్
  • ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు సిద్ధం
  • డిసెంబర్ 19 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మఫ్టీ పోలీస్' ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీ (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తమిళంలో 'తీయవర్ కులై నడుంగ' పేరుతో గత నెల 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో డబ్ చేసి విడుదల చేసినప్పటికీ, సరైన ప్రచారం లేకపోవడంతో ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే, థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్ర తమిళ వెర్షన్ 'సన్ నెక్స్ట్' ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇక కథ విషయానికొస్తే, ఒక అపార్ట్‌మెంట్‌లో రచయిత్రి జెబా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్‌పెక్టర్ మాగుడపాటి (అర్జున్) టేకప్ చేస్తాడు. అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరినీ అనుమానితులుగా పరిగణిస్తూ దర్యాప్తు మొదలుపెడతాడు. అసలు జెబాను హత్య చేసింది ఎవరు? ఈ హత్య వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అనే అంశాలతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. 


More Telugu News