ఉప్పల్ స్టేడియంలో రేపు సాయంత్రం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్

  • మ్యాచ్‌కు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడి
  • మ్యాచ్ కోసం 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
  • టిక్కెట్లు ఉన్నవారు మాత్రమే మ్యాచ్‌కు రావాలని సూచన
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు జరగనున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 'మెస్సీ గోట్ ఇండియా' టూర్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌ల కోసం 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. టిక్కెట్లు కలిగిన వారు మాత్రమే మ్యాచ్‌కు హాజరుకావాలని సూచించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 34 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మెస్సీ రేపు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటాడు. అక్కడి నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సందడి చేయనున్నాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్, అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలను ఖరారు చేశారు. రేపు రాత్రి మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే బస చేయనున్నాడు.


More Telugu News