నేను కూడా సీఎం అవుతా... ఒక్కొక్కరి తోలు తీస్తా: కవిత
- బీఆర్ఎస్ నేతలను గుంటనక్కలతో పోల్చిన కవిత
- అవినీతి చిట్టా విప్పుతానంటూ హెచ్చరిక
- తాను హరీశ్ ను విమర్శిస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని మండిపాటు
"కాంగ్రెస్తో కలిసి నేను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నానని అంటున్నారు. అలాంటి గుంటనక్కలకు చెబుతున్నా.. నాపై అనవసరంగా దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతా. ఇది జస్ట్ టాస్ మాత్రమే, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది" అని కవిత వ్యాఖ్యానించారు. తాను కూడా ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు. "ఆడపిల్ల కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారేమో.. ఒక్కొక్కరి తోలు తీస్తా. 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ జరిపిస్తా" అంటూ ఘాటుగా హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల భూములను నివాస భూములుగా మార్చారని, ఉద్యమ సమయంలో చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించే... రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని అన్నారు. హరీశ్ రావుపై తాను ఆరోపణలు చేస్తే... బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. తన భర్త ఫొటో చూపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.