మన అభివృద్ధి మనమే నిర్దేశించుకోవాలి.. బయటి శక్తుల ఒత్తిడికి లొంగొద్దు: గౌతమ్ అదానీ

  • భారత్ తన అభివృద్ధి మార్గాన్ని తానే ఎంచుకోవాలన్న అదానీ
  • బయటి శక్తుల ఒత్తిళ్లను గట్టిగా ప్రతిఘటించాలని పిలుపు
  • ఆర్థిక, వనరుల సార్వభౌమత్వమే రెండో స్వాతంత్ర్య సంగ్రామమ‌ని వెల్ల‌డి
  • పశ్చిమ దేశాల 'కథన వలసవాదం'పై అదానీ విమర్శలు
  • ఐఐటీ ధన్‌బాద్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఎక్సలెన్స్ సెంటర్ ప్రకటన
భారత్ తన అభివృద్ధి మార్గాన్ని తానే నిర్దేశించుకోవాలని, బయటి శక్తుల నుంచి వచ్చే ఒత్తిళ్లను గట్టిగా ప్రతిఘటించాలని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఆర్థిక, వనరుల సార్వభౌమత్వం కోసం చేసే పోరాటాన్ని ఆయన 'రెండో స్వాతంత్ర్య సంగ్రామం'గా అభివర్ణించారు. ఇవాళ‌ ఐఐటీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

21వ శతాబ్దంలో ఒక దేశ సార్వభౌమత్వం దాని సహజ వనరులు, ఇంధన వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని అదానీ స్పష్టం చేశారు. "మన కాళ్ల కింద ఉన్న వనరులను, మన ఎదుగుదలకు ఇంధనమైన శక్తిని మనం నియంత్రించాలి" అని ఆయన పిలుపునిచ్చారు. చారిత్రకంగా కర్బన ఉద్గారాలకు కారణమైన దేశాలే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలను నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నాయని, దీన్నే 'కథన వలసవాదం' అని ఆయన విమర్శించారు. మన అభివృద్ధి ప్రయాణాన్ని మనం నియంత్రించకపోతే, మన ఆకాంక్షలను అణచివేస్తారని హెచ్చరించారు.

ప్రపంచ గణాంకాలను ఉటంకిస్తూ, భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే 50 శాతం శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించిందని, అయినా తలసరి ఉద్గారాల్లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థాయిలో ఉందని గుర్తుచేశారు. తలసరి కొలమానాలు, చారిత్రక బాధ్యతలను పరిగణనలోకి తీసుకోకుండా భారత్ పనితీరును తక్కువ చేసే ప్రయత్నాలు పక్షపాతంతో కూడిన అంతర్జాతీయ ఈఎస్‌జీ ఫ్రేమ్‌వర్క్‌లను ప్రతిబింబిస్తాయని అన్నారు.

మైనింగ్‌ను పాత ఆర్థిక వ్యవస్థ అని కొందరు అనొచ్చని, కానీ అది లేకుండా కొత్త ఆర్థిక వ్యవస్థ లేదని అదానీ స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఐఐటీ ధన్‌బాద్ విద్యార్థుల కోసం రెండు కీలక కార్యక్రమాలను ప్రకటించారు. ఏటా 50 మందికి ప్రీ-ప్లేస్‌మెంట్ అవకాశాలతో కూడిన పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు, టెక్స్‌మిన్‌తో కలిసి మెటావర్స్ ల్యాబ్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సౌకర్యాలతో 'అదానీ 3ఎస్ మైనింగ్ ఎక్సలెన్స్ సెంటర్' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భయపడకుండా కలలు కనాలని, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.


More Telugu News