మియాపూర్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా... రూ.600 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్‌

HYDRAA cracks down on Miyapur encroachments protects government land
  • మియాపూర్‌లో రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • చెరువు కట్టపై నిర్మించిన 18 అక్రమ షట్టర్లను కూల్చివేసిన అధికారులు
  • తప్పుడు సర్వే నంబర్‌తో భూమి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లు
  • ప్రజావాణికి అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా
  • భూమికి ఫెన్సింగ్ వేసి, చెరువు కబ్జా యత్నాన్ని అడ్డుకున్న హైడ్రా
నగరంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ పరిధిలోని మక్తామహబూబ్‌పేటలో సుమారు రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిని ఆనుకుని ఉన్న మరో 5 ఎకరాల చెరువును కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా సమర్థంగా అడ్డుకుంది.

మియాపూర్ - బాచుపల్లి ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న మక్తామహబూబ్‌పేట చెరువు కట్టపై అక్రమంగా నిర్మించిన 18 షట్టర్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ దుకాణాల వెనుక ప్రైవేటు బస్సుల పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్న స్థలాన్ని కూడా ఖాళీ చేయించారు. మియాపూర్ సర్వే నంబర్ 39లోని చెరువు కట్టతో పాటు, గతంలో మైనింగ్ లీజుకు ఇచ్చిన సర్వే నంబర్ 44/5లో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.

ప్రజావాణికి అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు బడాబాబుల అండతో కూన సత్యంగౌడ్, బండారి అశోక్ ముదిరాజ్ అనే వ్యక్తులు ఈ కబ్జాకు పాల్పడినట్లు గుర్తించారు. మైనింగ్‌కు కేటాయించిన సర్వే నంబర్ 44/5 స్థానంలో, 44/4 అనే తప్పుడు సర్వే నంబర్‌ను సృష్టించి ఈ ఐదెకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు తేలింది. ఇక్కడ ఒక కార్ వాషింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, దాని ముసుగులో మొత్తం భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ అక్రమ కట్టడాల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. 18 షట్టర్ల నుంచి నెలకు రూ.9 లక్షలు, ప్రైవేటు బస్సుల పార్కింగ్ ద్వారా మరో రూ.8 లక్షల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఇదే స్థలంలో 2013లోనూ అక్రమ కట్టడాలు వెలవగా, అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చి వాటిని తొలగించారు. అయినా మళ్లీ కట్టడాలు వెలిశాయి. 

ప్రస్తుతం ఈ భూమి తమదేనని చెబుతున్న వారి వద్ద ఎలాంటి సరైన పత్రాలు లేకపోవడం గమనార్హం. తాము వేరే వ్యక్తులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని వారు చెబుతుండగా, ఆ వ్యక్తులు ఎవరనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి హైడ్రా అధికారులు ఆ ఐదెకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Go Back to Shorts
HYDRAA
AV Ranganath
Miyapur
Hyderabad
Serilingampally
Land encroachment
Government land

More Telugu News