అమెరికాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరో వ్యక్తి మృతి

  • తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అన్వేష్ అనే యువకుడు మరణం
  • ఇప్పటికే ఈ ఘటనలో హైదరాబాద్ విద్యార్థిని సహజారెడ్డి కన్నుమూత
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న భారత రాయబార కార్యాలయం
  • డిసెంబర్ 4న తెలుగు విద్యార్థులు నివసించే భవనంలో ప్రమాదం జరిగిన వైనం
అమెరికాలోని అల్బనీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్వేష్ అనే యువకుడు మరణించినట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. దీంతో ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది.
 
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని అల్బనీ నగరంలో ఈ నెల 4న ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆ మంటలు వేగంగా పక్కనే ఉన్న, తెలుగు విద్యార్థులు నివాసముంటున్న భవనానికి వ్యాపించడంతో హైదరాబాద్‌కు చెందిన సహజారెడ్డి అనే విద్యార్థిని అదే రోజు మృతి చెందింది. అన్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
 
ప్రమాదం జరిగిన నాటి నుంచి అన్వేష్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్ర గాయాల కారణంగా ఆయన కోలుకోలేకపోయారు. అన్వేష్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.


More Telugu News