Revanth Reddy: గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలి: రేవంత్ రెడ్డి
- మెగా ఈవెంట్లలో పతకాలు సాధించడమే లక్ష్యమన్న సీఎం
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని సిద్ధం చేయాలని ఆదేశం
- ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా ఉండాలన్న రేవంత్
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించడమే ధ్యేయంగా 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో క్రీడాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం భవిష్యత్తు ప్రణాళికలను ఖరారు చేశారు.
ప్రధానంగా గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలని సీఎం సూచించారు. అక్కడ ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలతో పాటు యూనివర్సిటీ కాంప్లెక్స్, అత్యాధునిక హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పలు ఆర్కిటెక్చర్ నమూనాలను పరిశీలించిన ఆయన, భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు.
కేవలం గచ్చిబౌలి మాత్రమే కాకుండా, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలను కూడా ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.