ఔను.. నా వివాహం రద్దయింది: స్మృతి మంధాన
- ఇన్ స్టా ఖాతాలో ప్రకటించిన స్మృతి మంధాన
- ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని రిక్వెస్ట్
- పలాశ్ ముచ్చల్ తో అర్ధాంతరంగా ఆగిన వివాహం
స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, శ్రీనివాస్ మంధాన కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో స్మృతి, పలాశ్ ల వివాహం రద్దయినట్లేనని ప్రచారం జరిగింది. ఎంగేజ్మెంట్ ప్రపోజల్, హల్దీ, మోహందీ వేడుకలకు సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే, ఈ వార్తలపై ఇటు స్మృతి కానీ అటు పలాశ్ కానీ స్పందించలేదు. పలాశ్ కుటుంబం మాత్రం వివాహం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.
స్మృతి సందేశం ఇదే..
‘నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడను. అయితే, కొన్నిరోజులుగా నా జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో స్పందించాల్సి వస్తోంది. పలాశ్ తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నా దృష్టంతా క్రికెట్ పైనే... జాతీయ జట్టుకు శక్తిమేర సేవలు అందిస్తాను’ అంటూ స్మృతి తన పోస్టులో వివరించింది.