ఆ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మారాలి: చంద్రబాబు హెచ్చరిక

  • ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
  • జగన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం
  • ఆర్ఎస్ఎస్ తరహాలో క్యాడర్‌ను సిద్ధం చేసుకోవాలని పిలుపు
  • విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పనితీరు మెరుగుపడిందని, అయితే మరో 37 మంది పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉన్న నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమీక్షలు, వన్‌ టూ వన్‌ భేటీల ద్వారా చాలామంది పనితీరులో మార్పు వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నాలుగైదు మార్గాల్లో కచ్చితమైన సర్వే నివేదికలను తెప్పించుకుంటున్నట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నివేదికల ఆధారంగానే పనితీరును అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమావేశంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌ విషయాన్ని కొందరు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ "నెలకోసారి వచ్చి విజ్ఞత కోల్పోయి మాట్లాడే వారి మాటలకు విలువ లేదు. అర్థం పర్థం లేని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు" అని వ్యాఖ్యానించారు.

అనంతరం పార్టీ క్యాడర్ నిర్మాణంపై మాట్లాడుతూ.. ఎలాంటి పదవులు ఆశించకుండా బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా పనిచేస్తోందని, అదే స్ఫూర్తితో టీడీపీ కార్యకర్తలను కూడా సైద్ధాంతికంగా బలోపేతం చేయాలని సూచించారు. అలాగే, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు 'స్కూల్ ఇన్నోవేటివ్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్' అనే కార్యక్రమాన్ని రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ భాగస్వామ్యంతో చేపడదామని పిలుపునిచ్చారు.

Chandrababu Naidu
TDP
Telugu Desam Party
AP CM
Andhra Pradesh Politics
YS Jagan Mohan Reddy
YSRCP
MLA Performance
School Innovative Partnership Summit
Ratan Tata Innovative Hub

More Telugu News