వైజాగ్‌లో ఫైనల్ ఫైట్.. టాస్ గెలిచిన భారత్.. తుది జ‌ట్టులో తెలుగు ప్లేయ‌ర్‌

  • విశాఖలో భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ కేఎల్ రాహుల్
  • వరుసగా 20 వన్డేల తర్వాత టాస్ గెలిచిన టీమిండియా
  • సిరీస్ డిసైడర్ కావడంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం
  • వాషింగ్టన్ సుందర్ స్థానంలో తుది జట్టులోకి తిలక్ వర్మ
భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత 20 సార్లు టాస్ ఓడిపోయిన భారత్, ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడంతో కెప్టెన్ రాహుల్ ముఖంలో చిరునవ్వు కనిపించింది.

టాస్ గెలిచిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "నిన్న రాత్రి ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నాం. జట్టుగా మేం నిలకడగా రాణిస్తున్నాం. అదే పద్ధతిని కొనసాగించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఒకే మార్పు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చాడు" అని తెలిపాడు.

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్‌కు కూడా బాగుందని, మంచి స్కోరు సాధించి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మైన‌ నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్‌మ‌న్, ర్యాన్ రికెల్టన్‌లు జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్‌రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మ‌న్.

కాగా, ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా నెగ్గగా, రెండో మ్యాచ్ లో సఫారీలు విజయం సాధించారు. దాంతో, సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. 



More Telugu News