కోహ్లీ ఉండగా సూపర్‌మ్యాన్‌తో పనేంటి?: సునీల్ గవాస్కర్

  • దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ
  • వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ శతకం
  • ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది వరుసగా రెండో సెంచరీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ అద్భుత ఫామ్ ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, "విరాట్ కోహ్లీ ఉండగా మనకు సూపర్‌మ్యాన్‌తో పనేముంది?" అంటూ గవాస్కర్ ఆకాశానికెత్తేశారు.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ తన కెరీర్‌లో 53వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతనికి ఇది వరుసగా రెండో శతకం కావడం విశేషం. రాంచీలో జరిగిన తొలి వన్డేలో కూడా కోహ్లీ 135 పరుగులతో రాణించాడు. రెండో వన్డేలో 90 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ, మొత్తం 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన సెంచరీల సంఖ్యను 84కి పెంచుకున్నాడు. దీంతో, 100 శతకాలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

కోహ్లీ ఆటతీరుపై గవాస్కర్ మాట్లాడుతూ, "ఏ ఫార్మాట్‌లోనైనా సింగిల్స్ బ్యాటింగ్‌కు జీవనాడి లాంటివి. కోహ్లీ కేవలం తన పరుగులే కాకుండా, భాగస్వామికి కూడా అదనపు పరుగులు అందించడానికి చూస్తాడు. అతని 53వ సెంచరీ అద్భుతం" అని కొనియాడారు. 


More Telugu News