మంచిర్యాల చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ.. పెద్దనాన్నే నిందితుడు!

  • మంచిర్యాల జిల్లాలో బాలిక హత్యాచార కేసును ఛేదించిన పోలీసులు
  • వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే ప్రధాన నిందితుడని వెల్లడి
  • కుర్‌కురే ఆశ చూపి పత్తి చేనులోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ నిందితులు
  • హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అంగీకారం
  • ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నంబాల గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించిన చిన్నారి హత్యాచార కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలికకు వరుసకు పెద్దనాన్న అయ్యే వ్యక్తే మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ భాస్కర్ ఈరోజు మీడియాకు వెల్లడించారు.

గత నెల 24వ తేదీన బాలిక మృతదేహం బావిలో లభ్యం కావడంతో ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో బాలికకు పెద్దనాన్న అయిన శనిగారపు బాపు (52), మరో వ్యక్తి ఉప్పారపు సతీశ్‌ (40) ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు తామే నేరం చేసినట్లు అంగీకరించారు.

ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి కుర్‌కురే ప్యాకెట్‌ కొనిస్తామని ఆశ చూపి, సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లామని నిందితులు తెలిపారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేశామని ఒప్పుకున్నారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసినట్లు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. 


More Telugu News