కోహ్లీ ఇన్నింగ్స్ చూశాక తొమ్మిదేళ్ల వెనక్కి వెళ్లినట్లు అనిపించింది: కుల్దీప్ యాదవ్

  • 2016-19 మధ్య కోహ్లీ ఇలాగే దూకుడుగా ఆడాడాన్న కుల్దీప్
  • కోహ్లీ ఆత్మవిశ్వాసంతో ఆడాడన్న కుల్దీప్ యాదవ్
  • కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన కెరీర్ ప్రారంభమైందని వెల్లడి
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. 2016-2019 మధ్యకాలంలో మాజీ కెప్టెన్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేశాడో, ఈ ఇన్నింగ్స్‌లోనూ అదే విధంగా ఆడాడని కుల్దీప్ ప్రశంసించాడు.

రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లలో భాగంగా మొదటి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 135 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

కోహ్లీ ఇన్నింగ్స్‌పై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడని కొనియాడాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతని ఆట చూశాక తాను దాదాపు ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని అన్నాడు.

2016, 2017, 2018, 2019 సంవత్సరాలలో కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కూడా ఇలాగే ఉండేదని కుల్దీప్ గుర్తు చేసుకున్నాడు. కీలక సమయంలో కోహ్లీ ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని పేర్కొన్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా కోహ్లీ తన సహచరులకు సూచనలు చేస్తుంటాడని తెలిపాడు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని, అతని నుండి ఎంతో నేర్చుకోవచ్చని కుల్దీప్ యాదవ్ అన్నాడు.


More Telugu News