హైదరాబాద్‌లో మరో రెండు ఇందిరమ్మ క్యాంటీన్లు.. ప్రారంభించిన మంత్రి పొన్నం

  • హైదరాబాద్‌లో రెండు కొత్త ఇందిరమ్మ క్యాంటీన్ల ప్రారంభం
  • కార్మికులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • మరిన్ని క్యాంటీన్లను విస్తరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశం
నగరంలో ఉపాధి కోసం వచ్చే పేద కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కవాడిగూడ కల్పన థియేటర్‌ వద్ద, బాగ్‌లింగంపల్లిలోను ఏర్పాటు చేసిన రెండు కొత్త క్యాంటీన్లను నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ ప్రారంభించారు. ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో నగరవ్యాప్తంగా మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళా పొదుపు సంఘాలకే అప్పగించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మహిళా సంఘాలకు వడ్డీలేని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.

మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, నగరంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ భోజన కేంద్రాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించడం అభినందనీయమని ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ అన్నారు. అనంతరం మంత్రి పొన్నం, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు క్యాంటీన్లలో కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. 


More Telugu News