అరుదైన ఘ‌న‌త‌కు చేరువలో రోహిత్ శర్మ.. 98 పరుగులు చేస్తే చాలు!

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులకు చేరువైన రోహిత్ శర్మ
  • ఈ ఘనతకు కేవలం 98 పరుగుల దూరంలో 'హిట్‌మ్యాన్'
  • సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఈ మైలురాయిని అందుకోనున్న నాలుగో భారతీయుడు
  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ రికార్డును అందుకునే అవకాశం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కేవలం 98 పరుగుల దూరంలో ఉన్నాడు. రేప‌టి నుంచి రాంచీలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

ఇప్పటివరకు 502 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 19,902 పరుగులు చేశాడు. ఇందులో 67 టెస్టుల్లో 4,301 పరుగులు, టీ20ల్లో 4,231 పరుగులు, వన్డేల్లో 11,370 పరుగులు ఉన్నాయి. ఈ మైలురాయిని దాటితే దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (27,673), రాహుల్ ద్రవిడ్ (24,064)ల సరసన రోహిత్ చోటు దక్కించుకుంటాడు.

2024 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, మే నెలలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. 125 బంతుల్లో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచి, జట్టుకు ఓదార్పు విజయాన్ని అందించాడు.

రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.


More Telugu News