ఏపీలోని ఆ ఊరిలో వింత ఆచారం.. మూడేళ్లకోసారి దంపతులకు మళ్లీ పెళ్లి!
- కనిగిరి మండలం కొత్తపాలెంలో తరతరాల సంప్రదాయం
- ఈ ఏడాది 40 జంటలు మళ్లీ వివాహం చేసుకున్న వైనం
- నాగార్పమ్మ అమ్మవారి కొలుపుల్లో భాగంగా వేడుక
గ్రామంలోని నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే కొలుపుల సందర్భంగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయంలో భాగంగా, కొలుపుల రెండో రోజు 'పట్నం కొలుపులు' నిర్వహిస్తారు. ఈ సమయంలోనే భార్యాభర్తలు సంప్రదాయబద్ధంగా మళ్లీ వివాహ బంధంతో ఒక్కటవుతారు.
నేటి ఆధునిక కాలంలో వివాహ బంధాలు బలహీనపడుతున్నాయని, చిన్నచిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారని ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో, కొత్తపాలెం గ్రామస్థులు పాటిస్తున్న ఈ ఆచారం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇదేదో మొక్కుబడిగా కాకుండా, శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవడం విశేషం. ఈ ఆచారం ద్వారా దాంపత్య బంధం మరింత బలపడుతుందని, ఆలుమగల మధ్య అనురాగం పెరుగుతుందని గ్రామస్థులు బలంగా విశ్వసిస్తున్నారు.