ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు.. తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

  • గిరిజన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై వేధింపుల ఆరోపణలు
  • సతీష్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచన
  • ఆరోపణల వాస్తవికతపై విచారణ జరపాలన్న సీఎంవో 
ఏపీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తీవ్రంగా స్పందించింది. అతడిని తక్షణమే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సతీష్ విధుల్లో కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
 
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, మంత్రి పీఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సతీష్‌పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
అదే సమయంలో, ఈ వ్యవహారంలో రెండు వైపులా విచారణ జరపాలని సీఎంవో సూచించడం గమనార్హం. మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఆమె ఆరోపణలు అవాస్తవమని విచారణలో తేలితే, ఆమెపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
 


More Telugu News