అమరావతిలో బ్యాంకుల హబ్.. 15 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన నిర్మల

  • కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాల అంచనా
  • ఎస్బీఐ, ఎల్ఐసీ, నాబార్డ్ వంటి ప్రముఖ సంస్థల రాక
రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 15 బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్‌, పొంగూరు నారాయణ హాజరయ్యారు.

రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమరావతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, నాబార్డ్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఉన్నాయి. ఈ పరిణామంతో రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News