మరింత పెరగనున్న బంగారం.. వచ్చే ఏడాది 5,000 డాలర్లకు!

  • బంగారం ధరపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
  • వచ్చే ఏడాది ఔన్స్ పసిడి 5,000 డాలర్లకు చేరవచ్చని అంచనా
  • అమెరికా ఆర్థిక సంక్షోభం, ఫెడ్ రేట్ల కోతలే ప్రధాన కారణాలు
  • ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌
బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా వచ్చే ఏడాది మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల స్థాయికి చేరవచ్చని డబ్ల్యూజీసీ సీఈఓ డేవిడ్‌ టైట్‌ జోస్యం చెప్పారు.

దుబాయ్‌లో జరిగిన ప్రీషియస్‌ మెటల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత అక్టోబరులో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,381 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ప్రస్తుతం 4,150 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రానున్న రోజుల్లో ఈ పరుగు కొనసాగి, వచ్చే ఏడాదిలో 5,000 డాలర్ల మార్కును తాకవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలోకి జారుకుంటుండటం వంటి అంశాలు బంగారం ధరకు మద్దతుగా నిలుస్తాయని టైట్ వివరించారు. దీనికి తోడు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేయడం, జపాన్‌లో అధిక ద్రవ్యోల్బణం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసొస్తాయని ఆయన పేర్కొన్నారు.

కేవలం డబ్ల్యూజీసీ మాత్రమే కాదు, గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు సైతం వచ్చే ఏడాది బంగారం ధర 5,000 డాలర్లకు చేరుతుందని గతంలోనే అంచనాలు విడుదల చేయడం గమనార్హం.



Gold Price
Gold
WGC
World Gold Council
David Tait
Goldman Sachs
JP Morgan
Bank of America
US Federal Reserve
Inflation

More Telugu News