బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... తుపానుగా మారే అవకాశం
  • ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా ప్రయాణం
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 48 గంటల్లో (నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయం నాటికి) ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ తుపాను ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా, ప్రభావిత జిల్లాల రైతులు పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


More Telugu News