షాంఘైలో వేధింపులు.. అండగా నిలిచిన భారత ఎంబసీకి అరుణాచల్ మహిళ కృతజ్ఞతలు

  • షాంఘై విమానాశ్రయంలో తన పాస్‌పోర్ట్‌ను గుర్తించలేదన్న భారత మహిళ
  • అధికారుల వేధింపులపై విదేశాంగ శాఖకు ఫిర్యాదు
  • గంటలోపే స్పందించి ఆదుకున్న భారత ఎంబసీ అధికారులు
  • అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపిన పెమా థాంగ్‌డోక్‌
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తనకు ఎదురైన వేధింపుల నుంచి బయటపడటానికి సహాయం చేసిన భారత విదేశాంగ శాఖ అధికారులకు, తనకు మద్దతుగా నిలిచిన వారికి పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ అనే భారతీయ మహిళ కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేంత సమయం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల పెమా వాంగ్‌జోమ్‌ చైనా నుంచి జపాన్‌ వెళ్లేందుకు షాంఘై విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, అక్కడి అధికారులు ఆమె భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించేందుకు నిరాకరించారని ఆమె ఆరోపించారు. చెల్లుబాటయ్యే వీసా ఉన్నప్పటికీ, తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని వాపోయారు. కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అధికారులు స్పందించారు. కేవలం గంటలోపే విమానాశ్రయానికి చేరుకుని, తనకు ఆహారం అందించారని పెమా తెలిపారు. అనంతరం చైనా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని, తాను సురక్షితంగా ఆ దేశం విడిచి రావడానికి సహాయపడ్డారని ఆమె వివరించారు. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.


More Telugu News