గంభీర్‌ను టార్గెట్ చేసిన విరాట్ కోహ్లి సోదరుడు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపాటు

  • టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి ఫైర్
  • పటిష్ఠ‌మైన వ్యవస్థను బలవంతంగా మార్చారని ఆరోపణ
  • పరోక్షంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విసుర్లు
  • ద‌క్షిణాఫ్రికా వ్యూహాలు ప్రొఫెషనల్‌గా ఉన్నాయంటూ పోస్ట్
  • సీనియర్లను తొలగించి జట్టును బలహీనపరిచారని విమర్శ
టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. జట్టు మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పటిష్ఠంగా ఉన్న జట్టును బలవంతంగా మార్చడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.

గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత్ ఓటమి అంచున నిలిచిన నేపథ్యంలో వికాస్ స్పందించారు. "ఒకప్పుడు విదేశాల్లో విజయాల కోసం ఆడేవాళ్లం. ఇప్పుడు మన సొంత గడ్డపైనే మ్యాచ్‌ను కాపాడుకోవడానికి పోరాడుతున్నాం. అంతా బాగున్న వ్యవస్థను బలవంతంగా మార్చాలని చూస్తే ఇలాగే ఉంటుంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

భారత జట్టు వ్యూహాలను కూడా ఆయన తప్పుబట్టారు. అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లను, మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణించే 3, 4, 5 స్థానాల బ్యాటర్లను పక్కనపెట్టారని విమర్శించారు. బౌలర్లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడం, అవసరానికి మించి ఆల్‌రౌండర్లను ఆడించడం వంటి ప్రయోగాలపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లతో ప్రొఫెషనల్ వ్యూహంతో ఆడుతోందని తెలిపారు.

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో, విదేశాల్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత బ్యాటింగ్ లైనప్ బలహీనపడింది. ప్రస్తుతం ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో వికాస్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News