స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ ఉక్కుపాదం... 21 లక్షల మొబైల్ నంబర్లు కట్!

  • స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన చర్యలు
  • ఏడాదిలో కాలంలో 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లు డిస్‌కనెక్ట్
  • నంబర్లను బ్లాక్ చేయకుండా డీఎన్‌డీ యాప్‌లో రిపోర్ట్ చేయాలన్న ట్రాయ్
  • ఆర్థిక మోసాలపై సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచన
దేశంలో స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ చర్యలు చేపట్టింది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్‌కనెక్ట్ చేయడంతో పాటు, మోసాలకు పాల్పడుతున్న సుమారు లక్ష సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. టెలికాం సేవలు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు, ప్రజలు తమకు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వివరాలను 'ట్రాయ్ డీఎన్‌డీ' యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని కోరింది. చాలా మంది వినియోగదారులు తమ ఫోన్లలో అనవసర నంబర్లను బ్లాక్ చేస్తే సరిపోతుందని భావిస్తారని, కానీ అది సరైన పద్ధతి కాదని ట్రాయ్ పేర్కొంది. నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల ఆ కాల్స్ వ్యక్తిగతంగా మనకు రాకుండా ఉంటాయి తప్ప, మోసగాళ్లు ఇతరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపలేమని వివరించింది.

అదే డీఎన్‌డీ యాప్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆ నంబర్‌ను గుర్తించి, దానిని శాశ్వతంగా నిలిపివేస్తారు. గతేడాది ఇంత పెద్ద సంఖ్యలో నంబర్లపై చర్యలు తీసుకోవడానికి లక్షలాది మంది పౌరులు డీఎన్‌డీ యాప్‌ను ఉపయోగించడమే కారణమని ట్రాయ్ తెలిపింది.

ఆర్థిక మోసాలు, సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 'సంచార్ సాథీ' పోర్టల్‌లోని 'చక్షు' ద్వారా కూడా టెలికాం సంబంధిత మోసాలను రిపోర్ట్ చేయవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన తక్కువగా ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ హెచ్చరించింది.


More Telugu News