పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

  • మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆస్తులు అటాచ్
  • సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ వ్యాపారాల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
  • విచారణ జరిపి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
హైదరాబాద్ నగర పరిధిలోని పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. సుమారు రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు సమాచారం. మధుసూదన్ రెడ్డి తన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ వ్యాపారాల ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కంపెనీ సుమారు రూ.300 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కంపెనీలు ప్రభుత్వానికి రూ.39 కోట్ల రాయల్టీ కూడా చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పటాన్‌చెరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

దర్యాప్తులో భాగంగా గత సంవత్సరం గూడెం మహిపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ ఆస్తి పత్రాలు వివిధ వ్యక్తుల పేర్ల మీద ఉన్నప్పటికీ, వాటి అసలు యజమాని మధుసూదన్ రెడ్డి అని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా, గూడెం మధుసూదన్ రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.


More Telugu News