హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ఆరు నెలల క్రితం పెద్ద కూతురు.. ఇప్పుడు మిగిలిన కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషాదం నుంచి కోలుకోకముందే, ఆ కుటుంబంలో మిగిలిన ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ (45), ఆయన భార్య విజయలక్ష్మి (42) దంపతులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కావ్య, శ్రావ్య (16) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, వీరి పెద్ద కుమార్తె కావ్య ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఈ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. నెల రోజుల క్రితమే వారు అంబర్‌పేట్‌లోని రామకృష్ణానగర్‌కు అద్దె ఇంటికి మారారు.

శనివారం వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, శ్రీనివాస్, విజయలక్ష్మి, వారి రెండో కుమార్తె, ఇంటర్ విద్యార్థిని అయిన శ్రావ్య ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు.

పెద్ద కుమార్తె మరణంతో తీవ్ర మనస్తాపానికి గురవడం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని చుట్టుముట్టడంతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో నలుగురూ ఆరు నెలల వ్యవధిలో తనువు చాలించడం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News