అరటి, పత్తి, మొక్కజొన్న పంటలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • అరటి రైతులను ఆదుకునేందుకు ముంబైకి రైల్వే వ్యాగన్లు
  • పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ధరల స్థిరీకరణ నిధితో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు
  • రంగుమారిన పత్తిని కూడా కొనాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
  • కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన
రాష్ట్రంలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ధరల పతనం, కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి, రైతులను ఆదుకునేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాయలసీమ అరటి రైతులు, రాష్ట్రవ్యాప్తంగా పత్తి, మొక్కజొన్న రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

రైళ్లలో ముంబైకి రాయలసీమ అరటి

రాయలసీమలో సుమారు 40 వేల హెక్టార్లలో పండుతున్న అరటికి సరైన ధర లభించకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. డిసెంబరు మొదటి వారం నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పగా, అప్పటివరకు రైతులను నష్టపోనివ్వకూడదని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ అరటిని ముంబై, కలకత్తా వంటి ప్రధాన మార్కెట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఓ ఏజెన్సీ ముందుకు వచ్చిందని అధికారులు తెలపగా, రవాణాకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అరటి ధరలు, కొనుగోళ్లపై వ్యాపారులతో ప్రతిరోజూ సమావేశాలు నిర్వహించి, మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించాలని ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న, పత్తి రైతులను ఆదుకునేందుకు చర్యలు

మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి మొక్కజొన్న రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ధరల వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈసారి 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, మార్క్‌ఫెడ్ ద్వారా 2.04 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ఇతర ఏజెన్సీలతో కొనుగోళ్లు చేపట్టాలని పేర్కొన్నారు.

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రానున్న వర్షాల దృష్ట్యా కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. రంగుమారిన, తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలైన తేమ శాతం వంటి కారణాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. 

సీఎం సూచనలతో స్లాట్ బుకింగ్ సమస్య పరిష్కారమైందని అధికారులు వివరించారు. కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజూ తనిఖీ చేస్తూ, రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.


More Telugu News