బైజు రవీంద్రన్‌కు యూఎస్ కోర్టు భారీ షాక్.. బిలియన్ డాలర్ల జరిమానా

  • బైజు రవీంద్రన్‌కు 1.07 బిలియన్ డాల‌ర్లు చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశం
  • నిధులు దాచిపెట్టారన్న ఆరోపణలపై వ్యక్తిగతంగా బాధ్యుడిని చేసిన కోర్టు
  • పదేపదే కోర్టుకు హాజరుకాకపోవడంతో డిఫాల్ట్ జడ్జిమెంట్ జారీ
  • తీర్పుపై అప్పీల్ చేస్తామని రవీంద్రన్ ప్ర‌క‌ట‌న‌
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించి, దాచిపెట్టారన్న ఆరోపణలపై ఆయన వ్యక్తిగతంగా బాధ్యుడని తేల్చిన యూఎస్ దివాలా కోర్టు.. సుమారు 1.07 బిలియన్ డాల‌ర్ల (రూ. 8,900 కోట్లకు పైగా) మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

బైజూస్‌కు చెందిన అమెరికా అనుబంధ సంస్థ ‘బైజూస్ ఆల్ఫా’ నిధుల మళ్లింపునకు సంబంధించి ఈ కేసు నడుస్తోంది. విచారణకు హాజరుకావాలని, సంబంధిత పత్రాలు సమర్పించాలని డెలావేర్‌లోని దివాలా కోర్టు జడ్జి బ్రెండన్ షానన్ పలుమార్లు ఆదేశించినా రవీంద్రన్ స్పందించలేదు. దీంతో కోర్టు ఆయనకు వ్యతిరేకంగా ‘డిఫాల్ట్ జడ్జిమెంట్’ జారీ చేసింది. ఒక పక్షం విచారణకు సహకరించనప్పుడు, కోర్టు విచారణ లేకుండానే ఇచ్చే తీర్పును డిఫాల్ట్ జడ్జిమెంట్ అంటారు.

అయితే, ఈ తీర్పును బైజు రవీంద్రన్ ఖండించారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా, తొందరపాటుతో ఈ తీర్పు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆల్ఫా సంస్థ నుంచి తీసుకున్న నిధులను తాను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడలేదని, మాతృసంస్థ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (TLPL) కోసమే ఖర్చు చేశామని తెలిపారు.

బైజూస్ ఆల్ఫా సంస్థను 1.2 బిలియన్ డాల‌ర్ల రుణంపై 2021లో ఏర్పాటు చేశారు. అయితే, ఈ నిధుల నుంచి 533 మిలియన్ డాల‌ర్ల‌ను ఇతర సంస్థలకు అక్రమంగా తరలించారని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.


More Telugu News