యూకే వలస విధానంలో భారీ మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
- బ్రిటన్లో వలసదారుల సెటిల్మెంట్పై కొత్త నిబంధనలు
- స్థిర నివాసం కోసం 20 ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి
- దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే వారికే ప్రాధాన్యతనిస్తామన్న ప్రభుత్వం
- కొత్త రూల్స్తో భారతీయులు సహా లక్షలాది మందిపై ప్రభావం
- డాక్టర్లు, నర్సులకు, ఎక్కువ సంపాదించే వారికి కొన్ని మినహాయింపులు
ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం, వివిధ రంగాల వారికి వేర్వేరు కాలపరిమితులుంటాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో పనిచేసే డాక్టర్లు, నర్సులు 5 ఏళ్లకే సెటిల్మెంట్కు అర్హత సాధిస్తారు. అత్యధికంగా సంపాదించేవారు, పారిశ్రామికవేత్తలు కేవలం 3 సంవత్సరాల్లోనే స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తక్కువ వేతనం ఉన్న కార్మికులు 15 ఏళ్లు, ప్రభుత్వ ప్రయోజనాలు (బెనిఫిట్స్) పొందే వలసదారులు 20 ఏళ్లు వేచి ఉండాలి. అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉన్నవారు స్థిరపడాలంటే 30 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది.
ఈ మార్పులు 2021 నుంచి యూకేకి వచ్చిన దాదాపు 20 లక్షల మంది వలసదారులపై ప్రభావం చూపనున్నాయి. వీరిలో అత్యధిక నైపుణ్యం కలిగిన వలసదారులుగా ఉన్న భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. అయితే, ఇప్పటికే సెటిల్డ్ స్టేటస్ పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రణాళికలపై 12 వారాల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరో కీలక మార్పు ఏంటంటే, వలసదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సామాజిక గృహ వసతి వంటివి సెటిల్మెంట్ పొందిన వెంటనే కాకుండా, బ్రిటిష్ పౌరసత్వం పొందాకే లభిస్తాయి. "బ్రిటన్లో స్థిరపడటం అనేది హక్కు కాదు, అదొక అదృష్టం. దాన్ని సంపాదించుకోవాలి" అని హోం సెక్రటరీ షబానా మహమూద్ వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు యూకే సెటిల్మెంట్ విధానాన్ని ఐరోపాలోనే అత్యంత కఠినమైనదిగా మార్చనున్నాయి.