బీఆర్ఎస్ కు షాక్... కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి

  • ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం
  • ప్రభుత్వం పంపిన దస్త్రంపై సంతకం చేసిన గవర్నర్  
  • త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనున్న ఏసీబీ
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేస్తూ, కేటీఆర్‌పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

మరోవైపు, ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయనపై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.


More Telugu News