సొంతగడ్డపైనా భారత్ ఓడిపోతోందంటే ఏదో తేడా కొడుతోంది: పుజారా

  • ఈడెన్ గార్డెన్స్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
  • జట్టులో ఏదో తీవ్ర లోపం ఉందన్న పుజారా
  • ఆటగాళ్లందరూ ప్రతిభావంతులేని వ్యాఖ్య
  • పిచ్ పైనా స్పందించిన పుజారా 
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమి పాలవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. స్వదేశంలో, అదీ చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా జట్టు ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమికి జట్టులో జరుగుతున్న మార్పుల దశ (Transitional Phase) కారణం కాదని, అసలు సమస్య వేరే ఏదో ఉందని అభిప్రాయపడ్డాడు.

జియోస్టార్ కార్యక్రమంలో మాట్లాడుతూ పుజారా ఈ అంశంపై తన విశ్లేషణను పంచుకున్నాడు. "విదేశాల్లో ఓటములు ఎదురైనప్పుడు జట్టులో మార్పులు జరుగుతున్నాయని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, స్వదేశంలో ఓడిపోవడానికి దాన్ని కారణంగా చూపించడాన్ని నేను అంగీకరించను. ప్రస్తుత భారత జట్టులో ప్రతిభకు ఎలాంటి కొదవ లేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లకు అద్భుతమైన ఫస్ట్-క్లాస్ రికార్డులు ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నప్పటికీ, మన సొంత గడ్డపై ఓటమి పాలవుతున్నామంటే.. జట్టులో ఏదో తీవ్రమైన లోపం ఉన్నట్టే" అని పుజారా స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్ జరిగిన పిచ్‌పై కూడా పుజారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి రోజు నుంచే బంతికి అనూహ్యంగా టర్న్, బౌన్స్ లభించిన వికెట్‌పై బ్యాటర్ల టెక్నిక్ ను తప్పుబట్టాడు. అయితే, ఓటమికి పూర్తి బాధ్యత బ్యాటర్లదే అని అన్నాడు. "ఒకవేళ ఈ మ్యాచ్ మంచి బ్యాటింగ్ పిచ్‌పై జరిగి ఉంటే, భారత్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇలాంటి క్లిష్టమైన పిచ్‌లను తయారు చేయడం వల్ల మన గెలుపు శాతం తగ్గి, ప్రత్యర్థి జట్టుకు సమాన అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. మన బలం బ్యాటింగ్ అయినప్పుడు, అందుకు అనుకూలించే పిచ్‌లు తయారు చేసుకోవాలి కానీ, మనల్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టుకోకూడదు" అని విశ్లేషించాడు.

భారత్‌లో ఉన్న క్రికెట్ ప్రతిభ గురించి కూడా పుజారా మాట్లాడాడు. "మన దేశంలో ఉన్న టాలెంట్ ఎలాంటిదంటే.. మన ఇండియా-ఏ జట్టు కూడా స్వదేశంలో సౌతాఫ్రికా లాంటి బలమైన జట్టును ఓడించగలదు. అలాంటప్పుడు సీనియర్ జట్టు ఓడిపోవడానికి ఆటగాళ్ల సామర్థ్యం కారణమని చెప్పలేం. కాబట్టి, ఈ ఓటమికి జట్టులో మార్పుల దశ కారణమనే వాదన సమర్థనీయం కాదు... కానీ ఏదో తేడా కొడుతోంది" అని వ్యాఖ్యాచాడు.

ప్రస్తుతం సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, గౌహతిలో జరగనున్న రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లోనైనా వ్యూహాలు మార్చి, క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా వ్యాఖ్యల నేపథ్యంలో, జట్టు యాజమాన్యం తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


More Telugu News