Papireddy: భోజనంలో విషం.. కుటుంబంపై హత్యాయత్నం.. పాత కక్షలే కారణం!

Family Poisoned in Karnataka Over Old Grudges Papireddy Arrested
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలో ఒక గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై విషప్రయోగం జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే వారంతా తీవ్రమైన వాంతులు, కళ్లు తిరగడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల్లో ఒక బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తమకు తెలిసిన చౌడారెడ్డి అనే వ్యక్తి భోజనానికి ముందు నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చాడని, వంటగదిలో కొంతసేపు గడిపాడని బాలిక తెలిపింది.

ఆమె సమాచారం ఆధారంగా పోలీసులు చౌడారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. బాధితుల పక్కింట్లో నివసించే పాపిరెడ్డి అనే వ్యక్తితో వారికి చాలా కాలంగా డ్రైనేజీ విషయంలో గొడవలున్నాయి. ఈ క్రమంలో పాపిరెడ్డి సూచన మేరకే తాను వారి భోజనంలో విషం కలిపినట్లు చౌడారెడ్డి అంగీకరించాడు. మొదట పురుగుల మందు కలిపినట్లు అనుమానించినా, విచారణలో భాగంగా సాంబారులో విషపూరితమైన ఉమ్మెత్త కాయల రసం కలిపినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఈ ఘటనపై చిక్కబళ్లాపూర్ ఎస్పీ కుశాల్ చౌక్సీ స్పందిస్తూ, "ఇది పక్కా ప్రణాళికతో చేసిన చర్య. నిందితులు బాధితుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం పాపిరెడ్డి, చౌడారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. 
Go Back to Shorts
Papireddy
Karnataka crime
poisoning case
Bagepalli
family poisoned
Chikkaballapur
attempted murder
old disputes
food poisoning

More Telugu News