114 ఏళ్ల పర్యావరణ యోధురాలు సాలుమరద తిమ్మక్క ఇకలేరు!
- ప్రముఖ పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క కన్నుమూత
- 114 ఏళ్ల వయసులో బెంగళూరులో తుదిశ్వాస
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృక్షమాత
- మొక్కలనే పిల్లలుగా భావించి పర్యావరణానికి సేవ
- 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన కేంద్రం
- బీబీసీ ప్రభావశీల మహిళల జాబితాలోనూ చోటు
కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో 1911 జూన్ 30న తిమ్మక్క జన్మించారు. వివాహమైన తర్వాత 25 ఏళ్ల వరకు సంతానం కలగకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ బాధను అధిగమించి తన జీవితాన్ని పర్యావరణ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తన భర్తతో కలిసి మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మొక్కలు నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ సస్యశ్యామలం చేశారు.
ఆమె నిస్వార్థ సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది. అంతర్జాతీయంగా కూడా ఆమె సేవలకు గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన 100 మంది అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో తిమ్మక్క స్థానం సంపాదించారు. తిమ్మక్క మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.