శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌!

  • శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను తేనున్న టీటీడీ
  • అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి ఏర్పాటు
  • 13 భాషల్లో అందుబాటులోకి రానున్న సేవలు
  • దర్శనం, వసతి, విరాళాల సమాచారం క్షణాల్లో తెలుసుకునే వీలు
  • ఫిర్యాదులు, అభిప్రాయాలు సులభంగా తెలిపే అవకాశం
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో తీపికబురు అందించింది. టెక్నాలజీని వినియోగించుకుంటూ భక్తులకు మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్‌ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఈ ఏఐ చాట్‌బాట్‌ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా, భక్తులు తమ ఫిర్యాదులను, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించనున్నారు.

ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉండనున్నాయి. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీటీడీ పాలనలో పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు కూడా చర్యలు చేపడుతోంది. ఈ కొత్త టెక్నాలజీ రాకతో భక్తులకు సమాచార సేకరణ మరింత సులభతరం కానుంది.


More Telugu News