ఆ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు... ఈ విషయంలో చేసిన తప్పుకు క్షమించండి: ప్రకాశ్ రాజ్

  • బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
  • 2016లో తాను ప్రమోట్ చేశానని, ఆ తర్వాత దానిని రద్దు చేసుకున్నానని వెల్లడి
  • తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పుతప్పే అన్న ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్‌లు, గేమింగ్ యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి ఎంతోమంది యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2016లో తాను ఒక యాప్‌న ప్రమోట్ చేశానని, అయితే ఆ యాప్ 2017లో బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు.

వెంటనే తాను ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ విషయంలో తాను క్షమాపణ కోరుతున్నానని ఆయన తెలిపారు. సిట్ అధికారులకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, బ్యాంకు లావాదేవీలను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ల కారణంగా ఎంతోమంది నష్టపోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కష్టపడితేనే ఫలితం ఉంటుందని, కష్టపడితేనే డబ్బులు వస్తాయని కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని ఆయన అన్నారు.


More Telugu News