‘శివ’ సీక్వెల్‌ ఎవరితో? .. రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర సమాధానం!

  • చైతన్య, అఖిల్‌తో శివ సీక్వెల్ చేసే ప్రసక్తే లేదన్న ఆర్జీవీ
  • ఆ సినిమా కేవలం నాగార్జున కోసమేనని స్పష్టీకరణ
  • తానే సీక్వెల్ చేస్తానంటూ నవ్వులు పూయించిన కింగ్ నాగార్జున
తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'శివ' సినిమా సీక్వెల్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పూర్తి స్పష్టతనిచ్చారు. ఒకవేళ 'శివ'కు సీక్వెల్ తీస్తే అది కింగ్ నాగార్జునతోనే ఉంటుందని, ఆయన కుమారులు నాగ చైతన్య లేదా అఖిల్‌తో ఉండదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలకు నాగార్జున కూడా అంతే సరదాగా స్పందించి నవ్వులు పూయించారు.

వివరాల్లోకి వెళితే.. 1989లో సంచలనం సృష్టించిన ‘శివ’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 14న మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు వర్మ ఆసక్తికరంగా బదులిచ్చారు. "నాగ చైతన్య, అఖిల్‌లలో ఎవరితో శివ సీక్వెల్ చేస్తారు?" అని అడగ్గా... "శివ సినిమా కేవలం నాగార్జున కోసమే. ఆయన్ను తప్ప మరో హీరోని అస్సలు ఊహించుకోలేను. ఇంకో 36 ఏళ్లయినా, నేను కాకుండా మరొకరు తీసినా అది సాధ్యం కాదు. సీక్వెల్ చేయాల్సి వస్తే అది నాగార్జునతోనే" అని ఆర్జీవీ కుండబద్దలు కొట్టారు.

వర్మ మాట్లాడుతున్నప్పుడే నాగార్జున కల్పించుకుని, "నేనే శివ సీక్వెల్‌ చేస్తా" అంటూ నవ్వడంతో అక్కడున్న వారంతా కూడా నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘శివ’ 1989 అక్టోబర్ 5న విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా గతినే మార్చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. 


More Telugu News