Steve Waugh: ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు.. కోహ్లీ, రోహిత్‌పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు

Steve Waugh on Kohli and Rohit Players are Not Bigger Than Game
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదని, ఈ నిజాన్ని ఆటగాళ్లు గ్రహించాలని ఆయన సూటిగా చెప్పాడు. కెరీర్ చివరి దశలో ఉన్న ఇలాంటి దిగ్గజాల విషయంలో సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ వా మాట్లాడుతూ.. "ఆటగాళ్లు కొంత బాధ్యత తీసుకోవాలి. ఆట కంటే తాము గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరూ శాశ్వతం కాదు. వారి స్థానంలో మరొకరు వస్తారనే వాస్తవాన్ని గ్రహించాలి. ఆటను ఆటగాళ్లు శాసించలేరు. అంతిమంగా జట్టు ప్రయోజనాల దృష్ట్యా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌దే తుది నిర్ణయం కావాలి" అని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ అంతర్జాతీయ కెరీర్ చివరి అంకంలో ఉన్నారు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఈ ఇద్దరూ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. రెండేళ్లలో జరగనున్న 2027 ప్రపంచకప్ నాటికి కోహ్లీకి 39, రోహిత్‌కు 40 ఏళ్లు నిండుతాయి. దీంతో వారి ఫిట్‌నెస్, ఫామ్ చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వరుసగా రెండు డకౌట్ల తర్వాత చివరి మ్యాచ్‌లో కోహ్లీ 74 పరుగులతో రాణించాడు.

ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు స్టీవ్ వా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాడు. "సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నవారు ఆటగాళ్లతో మరీ సన్నిహితంగా ఉండకూడదు. కొంత దూరం పాటించినప్పుడే కఠినమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోగలరు. అజిత్ అగార్కర్ ఆటగాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. కానీ, అదే సమయంలో అవసరమైన దూరం కూడా పాటించాలి. కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞులతో వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. కానీ, జట్టు కోసం ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సెలక్టర్‌కే ఉండాలి" అని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Steve Waugh
Virat Kohli
Rohit Sharma
India Cricket
Cricket
World Cup 2027
Ajit Agarkar
Indian Cricket Team
Team Selection
Cricket News

More Telugu News