విరాట్-అనుష్క బ్రేకప్ కథ.. ఆ స్టార్ హీరో కలపకపోతే ఏమయ్యేది?

  • ఒకప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్న విరాట్, అనుష్క
  • 2016లో ఈ జంట మధ్య బ్రేకప్ జరిగిందంటూ వార్తలు
  • నటన మానేయాలని కోహ్లి చెప్పడంతోనే గొడవలని ప్రచారం
  • బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చొరవతో మళ్లీ కలిసిన జంట
  • ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లండన్‌లో స్థిరపడిన విరుష్క జోడీ
టీమిండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకటి. వారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లండన్‌లో సంతోషంగా గడుపుతున్నారు. అయితే, పెళ్లికి ముందే ఈ జంట విడిపోయే అంచు వరకు వెళ్లిందన్న విషయం చాలా మందికి తెలియదు. సరిగ్గా ఆ సమయంలో ఓ స్టార్ హీరో వీరి మధ్య సయోధ్య కుదిర్చి బంధాన్ని నిలబెట్టారు. రెండు రోజుల క్రితం 37వ పుట్టినరోజు జరుపుకున్న విరాట్ జీవితంలోని ఈ ఆసక్తికర ఘట్టం గురించి ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం.

2016వ సంవత్సరంలో విరాట్, అనుష్క తమ ప్రేమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనుష్క నటనను కొనసాగించడం విరాట్‌కు ఇష్టం లేదని, అందుకే ఆమెను సినిమాలు మానేయమని కోరాడని, దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ పుకార్లలో నిజమెంతో తెలియరాలేదు కానీ, వారిద్దరూ విడిపోయారన్న వార్తలు మాత్రం బలంగా వినిపించాయి.

అనుష్క సోదరుడు కలిపేందుకు ప్రయత్నం.. సల్మాన్ జోక్యంతో మళ్లీ ఒక్క‌టి 
ఈ క్లిష్ట సమయంలో అనుష్క సోదరుడు కర్నేశ్‌ శర్మ వారిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, వీరి బంధాన్ని మళ్లీ గాడిన పెట్టిన ఘనత మాత్రం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కే దక్కుతుందని చెబుతారు. ‘సుల్తాన్’ చిత్రంలో సల్మాన్, అనుష్క కలిసి నటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విరాట్, అనుష్క మధ్య ఉన్న మనస్పర్థలను గమనించిన సల్లూ భాయ్‌, వారిద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించిన‌ట్లు స‌మాచారం.

సల్మాన్ చొరవతో మళ్లీ ఒక్కటైన ఈ ప్రేమ జంట, ఆ తర్వాత 2017 డిసెంబర్ 11న ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు.


More Telugu News