జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. పార్టీ ముఖ్య నాయకులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • ఉప ఎన్నికల్లో చిన్నపాటి నిర్లక్ష్యం లేకుండా కలిసికట్టుగా పని చేయాలని సూచన
  • మంత్రులందరికీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి
  • ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మరియు అందుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మంత్రులందరికీ బాధ్యతలు అప్పగించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఆయన సూచించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా గత నెల 31 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్డు షోలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సమీక్షించినట్లు సమాచారం.


More Telugu News