ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం ఎఫెక్ట్... టారిఫ్‌పై చైనా కీలక నిర్ణయం

  • అమెరికా వస్తువులపై ఉన్న అదనపు 24 శాతం సుంకాల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటన
  • ఈ పొడిగింపు ఏడాది పాటు అమలులో ఉంటుందని వెల్లడి
  • పది శాతం టారిఫ్ మాత్రం కొనసాగతుందన్న చైనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొంత సద్దుమణిగింది. ఈ క్రమంలో సుంకాలను తగ్గించే దిశగా రెండు దేశాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అమెరికా వస్తువులపై అదనంగా ఉన్న 24 శాతం సుంకాల సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ పొడిగింపు ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. అయితే, పది శాతం టారిఫ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 10 నుంచి అమలులోకి రానుంది.

గత నెల చివరలో దక్షిణ కొరియా వేదికగా జరిగిన ట్రంప్, జిన్‌పింగ్ భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత ట్రంప్ మాట్లాడుతూ, ఆ భేటీ అద్భుతంగా జరిగిందని, సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఫెంటానిల్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాను అడ్డుకునేందుకు జిన్‌పింగ్ కృషి చేస్తారని విశ్వసిస్తున్నానని, అందుకే ఫెంటానిల్ సుంకాలను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.


More Telugu News