చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొని 19 మంది మృతి
  • మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు
  • గుంతను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు వెల్లడి
  • ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో దర్యాప్తు సంక్లిష్టం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మీర్జాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లతో సహా మొత్తం 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మరణించడంతో తప్పు ఎవరిదనేది ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు. బస్సును ఢీకొట్టిన తర్వాత టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులోకి పడటంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఆయన వివరించారు. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే శవపరీక్షలు నిర్వహిస్తున్నామని, అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్లు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్‌ను మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌ కాంబ్లేగా గుర్తించారు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి కంకర లోడుతో వికారాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.


More Telugu News