చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి

  • రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • తాండూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల దుర్మరణం
  • మరో ఎంబీఏ విద్యార్థిని కూడా మృతి
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సహా మొత్తం నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

తాండూరులోని గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఈ ముగ్గురూ హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడతారనుకున్న కుమార్తెలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గత నెల 17న జరిగిన ఓ వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ అక్కాచెల్లెళ్లు, ఇప్పుడు ఒకేసారి మృత్యువాత పడటాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదే ప్రమాదంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా మరణించింది. ఎంబీఏ చదువుతున్న అఖిల మరణవార్త విని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఒకే ప్రమాదంలో నలుగురు యువతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకం నెలకొంది.


More Telugu News