Asia Cup 2025: ట్రోఫీ తిరిగివ్వండి.. లేదంటే ఐసీసీలో తేల్చుకుంటాం: బీసీసీఐ

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం మరింత ముదురుతోంది. గెలిచిన ట్రోఫీని ఇప్పటివరకు అప్పగించకపోవడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ట్రోఫీని తమకు అందించకపోతే ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళతామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

దుబాయ్‌లో సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి ఆసియా కప్ గెలుచుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ, విజేత పతకాలు లేకుండానే విజయోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చింది.

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడారు. "ఇంకో రెండు, మూడు రోజులు చూస్తాం. అప్పటికీ ట్రోఫీ మాకు చేరకపోతే... ఈ నెల‌ 4 నుంచి దుబాయ్‌లో ప్రారంభమయ్యే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. ఇప్పటికే 10 రోజుల క్రితం ఏసీసీకి లేఖ రాశాం. ట్రోఫీ రాకపోతే క్రికెట్‌లో అత్యున్నత సంస్థ అయిన ఐసీసీ దృష్టికి తీసుకెళతాం" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ ఈ నెల‌ 10న దుబాయ్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని అందిస్తామని ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు ఈ సమస్య కొలిక్కి రాలేదు. పైగా నఖ్వీ ఆ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు కథనాలు రావడం వివాదాన్ని మరింత జఠిలం చేసింది. దీంతో బీసీసీఐ ఇప్పుడు నేరుగా ఐసీసీని ఆశ్రయించేందుకు సిద్ధమైంది.
Asia Cup 2025
BCCI
Jay Shah
ACC
ICC
Mohsin Naqvi
India vs Pakistan
Cricket
Trophy Dispute
Suryakumar Yadav

More Telugu News