నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
- విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదన్న ఉపరాష్ట్రపతి
- తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన రాధాకృష్ణన్
- స్వాతంత్య్ర యోధుడు దేవర్ మాటలనే నమ్ముతున్నట్లు వెల్లడి
- తాను నేతాజీని కలిశానని దేవర్ చెప్పారని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి
- దేవర్ తన జీవితంలో అబద్ధం చెప్పలేదని వ్యాఖ్య
తమిళనాడు పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి గురువారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నేతాజీకి అత్యంత నమ్మకమైన అనుచరుడైన పసుపొన్ ముత్తురామలింగ దేవర్ చెప్పిన మాటల వల్లే తాను ఈ విషయాన్ని నమ్ముతున్నట్లు వివరించారు. “నేతాజీ ఆ విమాన ప్రమాదంలో మరణించలేదు, నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ నాతో చెప్పారు. అందుకే నేను నమ్ముతున్నాను” అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
దేవర్ తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని, ఆయన తన రాజకీయ ప్రస్థానంలోనూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. బుధవారం రాధాకృష్ణన్ రామనాథపురంలో దేవర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా దేవర్ త్యాగాలను ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. హెచ్చుతగ్గులు లేని సమాజం కోసం దేవర్ తన జీవితాన్ని అంకితం చేశారని ట్వీట్ ద్వారా తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమంత్రి పదవిని ప్రతిపాదించగా, దేవర్ దాన్ని తిరస్కరించారని రాధాకృష్ణన్ గుర్తుచేశారు. “నేతాజీకి న్యాయం జరగడం మాత్రమే తనకు కావాలని అప్పుడు నెహ్రూతో దేవర్ చెప్పారు” అని ఉపరాష్ట్రపతి వివరించారు.