'మా ఇంటి బంగారం'... కొత్త సినిమా మొదలుపెట్టిన సమంత

  • సెట్స్‌పైకి వెళ్లిన సమంత కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'
  • పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం
  • సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న నటి సమంత
  • సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేస్తున్న సామ్
గత కొద్ది నెలలుగా ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ స్టార్ హీరోయిన్ సమంత తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. 'మా ఇంటి బంగారం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఈ విషయాన్ని సమంత స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పతాకంపై ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వేడుకలో ఆమె నారింజ రంగు సల్వార్ కమీజ్‌లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఆమెతో పాటు తన పెంపుడు శునకం 'హాష్' కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, "ఏం చూస్తున్నావ్? వాళ్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నారు" అని సరదా క్యాప్షన్ జోడించారు.

"ప్రేమ, ఆశీర్వాదాల మధ్య 'మా ఇంటి బంగారం' ప్రయాణం ముహూర్తంతో ప్రారంభమైంది. మేం ఏం సృష్టిస్తున్నామో మీతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సినిమాను ప్రారంభిస్తున్న మాకు మీ ప్రేమ, మద్దతు కావాలి" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ నెలలోనే తన కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుందని సమంత ఇటీవల అభిమానులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ఇటీవల ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లపై మాట్లాడారు. "నా విడాకులు, అనారోగ్యం.. ప్రతీది ప్రజల ముందు బహిర్గతమైంది. బలహీనంగా ఉన్నందుకు నిరంతరం విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నాను" అని ఆమె తన ఆవేదనను పంచుకున్నారు.

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని 'ఊ అంటావా' పాటలో నటించడంపైనా ఆమె స్పందించారు. "అటువంటి పాటలు నేను చేయగలనా లేదా అని పరీక్షించుకోవడానికే చేశాను. నన్ను నేను ఎప్పుడూ సెక్సీగా భావించలేదు. అది కేవలం ఒక సవాలుగా తీసుకుని చేసిన ప్రయత్నం మాత్రమే" అని సమంత వివరించారు.


More Telugu News