స్పోర్ట్స్ హబ్ దిశగా ఏపీ.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థతో మంత్రి లోకేశ్‌ భేటీ

  • బ్రిస్బేన్‌లో పాపులస్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న లోకేశ్‌
  • ప్రపంచ ప్రఖ్యాత స్టేడియాల నిర్మాణంలో పాపులస్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు
  • అత్యాధునిక క్రీడా సౌకర్యాల కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి
  • పర్యావరణహిత, కమ్యూనిటీ క్రీడా సముదాయాల డిజైన్లు అందించాలని కోరిక
  • పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ 'పాపులస్' ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన క్రీడా మైదానాలకు రూపకల్పన చేసిన ఈ సంస్థ సహకారంతో ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్, ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ ఎలిజిబెత్ డిసిల్వాలతో మంత్రి లోకేశ్‌ చర్చలు జరిపారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాపులస్ సంస్థ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ (సర్దార్ పటేల్) స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం వంటి 3,500కు పైగా ప్రాజెక్టులను డిజైన్ చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. "రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియంలు, శిక్షణా కేంద్రాల నిర్మాణానికి మీ డిజైన్ సహకారం అందించండి. పర్యావరణ హితమైన, ఇంధన సామర్థ్యం గల క్రీడా, వినోద వేదికల నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి" అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, పర్యాటకాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్‌ల రూపకల్పనలో కూడా భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.



More Telugu News